అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఏపీలో రాజధాని ఏర్పాటుకు కేంద్రం రూ.2500 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉంది. అందులో భాగంగా రూ.1500 కోట్లు ఇచ్చింది. మరో రూ.1000 కోట్లు రావాల్సి ఉంది. అయితే, రాష్ట్ర సర్కారు మొత్తం మూడు రాజధానులను ఏర్పాటు చేయనుండటంతో అందుకు కావాల్సిన అదనపు అవసరాలతో మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించనుంది. ఆ మేరకు ఏపీలో నూతన రాజధాని ఏర్పాటుకు అవసరమయ్యే అన్ని రకాల నిధులను కేంద్రమే సమకూర్చేలా ఏపీ పునర్విభజన చట్టం-2014ను సవరించాలని కోరనుంది.
అదేవిధంగా నవంబర్ 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ సర్కారు గత ఫిబ్రవరిలో కేంద్రానికి సమాచారం ఇచ్చింది. అమరావతి మెట్రోపాలిటన్ రీజినల్ అథారిటీ ఏరియా లెజిస్లేటివ్ క్యాపిటల్గా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజినల్ అథారిటీ ఏరియా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, కర్నూల్ మెట్రోపాలిటన్ రీజినల్ అథారిటీ ఏరియాను జ్యుడీషియల్ క్యాపిటల్గా ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.