అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల( APSRTC ) ప్రైవేటీకరణ ఆలోచనకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ ( JAC ) నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. జూలై రెండవ వారం నుంచి నెలాంతరం వరకు దశలవారీగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. విద్యుత్ బస్సుల పేరిట ప్రైవేట్ ఆపరేటర్లకు అవకావం ఇవ్వడం సరికాదని జేఏసీ కన్వీనర్లు శ్రీనివాసరావు, దామోదరరావు వెల్లడించారు.
ఆర్టీసీని పరిరక్షించాలంటూ జులై 7,8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని, 9 నుంచి 18వ తేదీవరకు ప్రజా ప్రతినిధుల మద్దతు కోరే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
19 నుంచి 26 వరకు ఏపీ సీఎంకు ఉద్యోగుల ఆవేదన తెలియజేస్తూ వినతిపత్రాలపై సంతకాల సేకరణ, 27న ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని అన్ని జిల్లాలు, డిపోల యూనియన్ నాయకులకు సూచించారు. 30న విజయవాడలో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించి తదుపరి భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకుంటామని జేఏసీ నాయకులు వెల్లడించారు.