అమరావతి : తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహిస్తున్నది సభ కాదని.. అది రాజకీయ సభ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యనించారు. యాత్రలో పాల్గొన్నది రైతులు కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులేనని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం 29 గ్రామాలు.. ఆ సామాజిక వర్గమే టీడీపీకి ముఖ్యమని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడమే ఎజెండాగా టీడీపీ ప్రయత్నిస్తుందని .. మేం చెప్పిందే జరగాలి అనుకుంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
నాగార్జున సాగర్, పోలవరం ప్రాజెక్టులు కడుతుంటే రైతులు భూములు ఇవ్వలేదా..రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న పనులను త్యాగం అంటారా.. ఒక సామాజిక వర్గం కోసం చేసిన పనులు త్యాగాలు అవుతాయా.. అని బొత్స ప్రతిపక్షాలను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మిగతా పార్టీల మాదిరిగా విధానాలను మార్చుకోబోమని ఆయన పేర్కొన్నారు . ప్రాంతీయ అసమానతలు ఉండకూడదనే ఉద్దేశంతో .. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమని అన్నారు.