శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు దేవస్థానం చేపడుతున్న ముందస్తు చర్యలకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్టెజేషన్ (ఐఎస్వో) ప్రశంసలు లభించాయి. ఆదివారం ఆలయ ఈవో కేఎస్ రామారావును కలిసిన అంతర్జాతీయ హెచ్ వై ఎం ధృవీకరణ సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య ఐఎస్వో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ క్షేత్రానికి వచ్చే యాత్రికులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడంలో దేవస్థాన అధికారులు సిబ్బంది నిరంతర కృషి అభినందనీయమని అన్నారు. అదే విధంగా పారిశుద్య నిర్వహణ మరియు కోవిడ్ నిబంధనలు అమలు చేయడంలో రాష్ట్రంలోనే తొలి ఆలయంగా గుర్తించి గుడ్ హైజెనిక్ ప్రాక్టీసెస్ ( జీహెచ్పీ ) సంస్థ దృవీకరణ పోందడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు క్షేత్ర పరిధినంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ గుర్తింపు దక్కిందని తెలిపారు. ఇటువంటి ప్రశంసలు పొందడంతో ఆలయ ఉద్యోగులలో మరింత నూతనోత్సాహం పెరుగుతుందన్నారు. అంతేకాక ఉద్యానవనాలు వివిధ రకాల ఔషధ మెక్కలు పెంపకం, అన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీ విక్రయాల నిర్వహణ, ఎల్ఈడీ లైట్లు, అధునాతన సీసీ కంట్రోల్ కమాండ్ సెక్యూరిటీ సిస్టమ్, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సంబందిత విభాగాల పనితీరుపై గతంలో ఇచ్చిన ఐఎస్వో ప్రశంసా దృవీకరణ పత్రాలు పునరుద్దరించబడినట్లు తెలిపారు.