Aarogyasri | కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో ఆరోగ్య శ్రీ అమలుపై అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా ? అని నిలదీశారు.
ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా ? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల నిలదీశారు. పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా అని అడిగారు. ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెండింగ్లో పెడితే.. ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయని చెప్పారు. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయన్నారు. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన అద్భుత పథకం ఆరోగ్యశ్రీ అని వైఎస్ షర్మిల కొనియాడారు.పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకమని చెప్పారు. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకమని అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే అని చెప్పారు. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించమని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్చేశారు. పెండింగ్లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.