అమరావతి : ఏపీలోని విశాఖపట్నానికి బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ వెనుక బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుటుంబ సభ్యులే ఉన్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM Jagan) సంచలన ఆరోపణలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ (YCP) ఆధ్వర్యంలో నిర్వహించిన‘ మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విశాఖలో పట్టుకున్న డ్రగ్స్ (Drugs) వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
ఎవరెన్ని కష్టాలు పెట్టినా, వ్యవస్థలు వెంటబడినా కూడా నా వెంట ఉన్న వైఎస్సార్ జిల్లా ప్రజలున్నారని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత , ఇంటింట సంక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం 2.70 లక్షల కోట్ల రూపాయాలను నేరుగా అందజేశామని పేర్కొన్నారు. ప్రజల ఏజెండానే లక్ష్యంగా వైసీపీ ఏ జెండాలతో కలవడం లేదని వెల్లడించారు.