Amalapuram | అమలాపురంలో ఇటీవల జరిగిన విధ్వంసకర ఘటనలతో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు ఐదో రోజు కూడా పునరుద్ధరణకు నోచుకోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో అన్ని రంగాల వారు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు. సిగ్నల్స్ కోసం సాప్ట్వేర్ ఉద్యోగులు లాప్టాప్, ఫోన్లు పట్టుకొని జిల్లా సరిహద్దులకు తరలిపోతున్నారు. యానాం, కాకినాడ, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరం, నర్సాపురం వంటి దూరప్రాంతాలకు వెళ్లి పనిచేస్తున్నారు. కొందరు గోదావరి ఒడ్డున కూర్చుని అతికష్టం మీద విధులు నిర్వహిస్తున్నారు.
మరోవైపు డిజిటల్ సేవలు నిలిచి ఆర్థిక లావాదేవీలు జరగక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంటర్నేట్ సేవలు పునరుద్దరించాలని, లేనిపక్షంలో ధర్నాకు దిగుతామని సాప్ట్వేర్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం రాజోలు నియోజకవర్గాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ, ఉపాధిహామీ సేవల వివరాల నమోదుకు విఘాతం కలిగింది. ఇదిలా ఉండగా అమలాపురం అల్లర్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లకు సంబంధించి ఇప్పటికే 44 మందిని అరెస్టు చేసిన పోలీసులు, మరికొంత మందిని అరెస్టు చేసే పనిలో నిమగ్నమయ్యారు.