AP News | ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఓ మహిళ చేసిన వంట నలుగురి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఉమ్మెత్త ఆకులతో కూర చేసుకుని తింటే బలమని ఎవరో చేసిన వీడియో చూసి ఓ మహిళ చేసిన పప్పు కూర తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామానికి చెందిన బిక్కిన వీరబ్బు కుమారుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. దీంతో వారి కుటుంబం హైదరాబాద్లో నివసిస్తుంది. ఊళ్లో ముత్యాలమ్మ తీర్థం ఉండటంతో కోడలు గంగాభవానీ, ఇద్దరు మనుమళ్లతో కలిసి వీరబ్బు యర్రంపాలెం వచ్చారు. అదే గ్రామంలో ఉన్న గంగాభవానీ పుట్టింట్లోనే ఉంటూ.. ఆదివారం నాడు ఎంతో సంతోషంగా అమ్మవారి తీర్థంలో గడిపారు.
ఇక సోమవారం నాడు గంగాభవానీ తల్లి వీరలక్ష్మి ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఉమ్మెత్త ఆకులతో పప్పు వండింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వీరలక్ష్మీ, వీరబ్బు, గంగాభవానీ, వారి బంధువు జయలక్ష్మీ ఉమ్మెత్త పప్పుతో భోజనం చేశారు. ఆ తర్వాత అందరూ అస్వస్థతకు గురై.. సాయంత్రం నాలుగు గంటల సమయానికి అందరూ మత్తులోకి జారుకున్నారు. ఇది గమనించిన గంగాభవానీ తండ్రి హరిబాబు వెంటనే వారిని పెద్దాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఉమ్మెత్త ఆకు పప్పు కూర కాకుండా వేరే కూరతో భోజనం చేసిన హరిబాబు, గంగాభవానీ ఇద్దరు కుమారులు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు.