అమరావతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాట (Tirupati stampede) ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు హైకోర్టు (High court) రిటైర్ట్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమించింది. విచారణ జరిపి 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరింది.
వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi) సందర్భంగా టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుపతిలో టోకెన్ల కేంద్రాలను నెలకొల్పింది. అయితే ఈనెల 8వ తేదీన పద్మావతి పార్కులో నెలకొల్పిన టోకెన్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 గురు చనిపోగా 50 మంది వరకు భక్తులు గాయపడ్డారు. టీటీడీ (TTD) చరిత్రలో ఎన్నడూ జరుగని విధంగా తొక్కిసలాట జరగడం, ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో టీటీడీ, కూటమి ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి.
స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందిన క్షతగాత్రులను పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని( Exgratia) ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ. 2లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఈ తొక్కిసలాటలో పోలీసు, అధికారుల వైఫల్యం ఉందంటూ ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు డీఎస్పీని, గోశాల అసిస్టెంట్ను డైరెక్టర్ను అక్కడి నుంచి బదిలీ చేశారు. టీటీడీ పాలక మండలికి కూడా ముఖ్యమంత్రి చివాట్లు పెట్టిన విషయం తెలిసిందే .