అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni sitaram) మరోసారి విచారణకు పిలిచారు. రేపు(సోమవారం) విచారణకు రావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi) , మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ( Kotam Reddy Sridhar Reddy) కి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు .
ఈ నెల 8న జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తూ 12వ తేదీన అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం నలుగురు సభ్యులు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా వీరిలో ఆనం రామనారాయణరెడ్డి ఒక్కరే ఈనెల 8న హాజరై సమాధానమిచ్చారు.
కాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఉదయం వైసీపీ రెబెల్స్ నలుగురు , మధ్యాహ్నం టీడీపీ రెబెల్స్ ముగ్గురు విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.