అమరావతి : ఏపీలో ఐదేండ్ల వైసీపీ జగన్ (YS Jagan) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజాగళం పేరిట ప్రచార యాత్రను బుధవారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరులో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన జగన్ను రాయలసీమ (Rayalaseema) లోకి రానివ్వద్దని పిలుపునిచ్చారు. ఒక్క సీమ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, తన స్వార్థం కోసం ఒక తరాన్ని నాశనం చేశాడని ఆరోపించారు.
ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ప్రజలపై పన్నుల పేరటి పిడిగుద్దులు గుద్దాడని విమర్శించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ముసుగువీరుడు బయటకు వస్తున్నాడని జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యనించారు. రైతులకు సబ్సీడీలు, పొలాలకు నీళ్లు , బిందు సేద్యం పరికరాలు అందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజల బతుకుల్లో చీకటి నింపిన వ్యక్తులను గుర్తించాలని కోరారు. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమాగా వెలుగొందిదని, నేడు ఎడారిగా మారే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమ సాగునీటి రంగంలో ఎన్టీఆర్ మార్పు తెచ్చారని , తెలుగుగంగ (Telugu Ganga) , హంద్రీనీవా, నగరి, గాలేరును ప్రారంభించారని గుర్తు చేశారు.