అమరావతి : కర్నూలు జిల్లా గోనెగండ్లలోని పాఠశాలలో పెచ్చులు ఊడిపడి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 66 మంది విద్యార్థులు ఉండగా ఉదయం ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ఘటనలో సఫాన్, అరుణ్ అనే విద్యార్థులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బడికొచ్చిన పిల్లలు రక్తం చిందించాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇకనైనా పాఠశాలల్లో వసతుల పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపాలని సూచించారు. నాడు-నేడు పథకం వైసీపీ ప్రభుత్వ ప్రచారం ఆర్భాటమేనని ఆరోపించారు. పాఠశాలల పునరుద్దరణకు ఏమీ చేయట్టేదనేందుకు ఈ ఘటనే నిదర్శనమని, గాయపడ్డ చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.