అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైన రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు వివిధ పద్దతుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు సమర సంక్రాంతి పేరిట నిరసనలు నిర్వహిస్తున్నారు. శనివారం తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు నిరసన తెలిపారు. రోడ్డుపైనే వంటవార్పు చేసి భోజనాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమను రోడ్డు పాల్జేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతిని కొనసాగించి న్యాయం చేయాలని గత 760 రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. పిల్లాపాపలతో ఇంటి వద్ద పండగ చేసుకోవాల్సిన తాము వరుసగా మూడో సంవత్సరం కూడా రోడ్లపై నిరసనలు చేయాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని ఆందోళన వ్యక్తం చేశారు.