Chandrababu | దుబాయ్ను చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పటికీ ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని తెలిపారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్కు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాకదర అనుభూతిని కలిగిస్తాయని అన్నారు.
దుబాయ్ అభివృద్ధిని తాను చూశానని.. వారు ఇంటర్నెట్ సిటీ పెడితే.. తాను హైటెక్ సిటీ కట్టానని చంద్రబాబు గుర్తుచేశారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. విభిన్నంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని తెలిపారు. 2021లో మనం కరోనా వల్ల భయపడ్డామని.. ఆ సమయంలో యూఏఈ ఇన్వెస్టోపియాను తీసుకొచ్చారని తెలిపారు. యూఏఈతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. 1.1 కోట్ల మంది యూఏఈ జనాభాలో 40 శాతం మంది భారతీయులే ఉన్నారని తెలిపారు. వారి ద్వారా కూడా అక్కడ అభివృద్ధి జరుగుతుందని, మన వాళ్లకు అవకాశాలను వస్తున్నాయని అన్నారు. వ్యాపారపరంగా భారతదేశాన్ని ఎవరూ విస్మరించలేరని ఆయన అన్నారు.
1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్తో పరిస్థితి మారిందని చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారత్కు అపార అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నామని.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదని అన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.