అమరావతి : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టింబర్ డిపోలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సాయి బాలాజీ థియేటర్ వెనుక ఉన్న కలప పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి 11.30 ప్రాంతంలో మంటలు చెలరేగి.. ఒక్కసారిగా వ్యాపించాయి. శివారు ప్రాంతంకావడంతో ఎవరూ గమనించకపోవడంతో
మంటలు టింబర్ డిపో మొత్తం అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి సీహెచ్ వెంకట్రావు సిబ్బందితో హుటాహుటిన అక్కడకు వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రెండు యంత్రాల్లోని నీరంతా అయిపోవడంతో వారు స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించి నీళ్లు అందించాల్సిందిగా కోరినా స్పందించలేదు. విద్యుత్ ప్రమాదానికి ఆస్కారం ఉండడంతో వన్ టౌన్లో పూర్తిగా కరెంటు సరఫరాను నిలిపివేశారు. ఘటనలో రూ.10లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితుడు షేక్ జబ్బార్ పేర్కొన్నారు.