అమరావతి: ఏపీలో సారా మరణాలపై అసెంబ్లీలో చర్చించాలని పట్టుబడుతూ సస్పెన్షన్కు గురైన 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.ఈవాళ విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా వారిని గృహనిర్భందం చే శారు. విజయవాడలో అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య , బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, దేవినేని ఉమను గృహ నిర్బంధించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పా టు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారాతో 26 మంది మృతి చెందారని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సమావేశాలను అడ్డుకుంటున్నారు. కల్తీ మరణాలపై అసెంబ్లీలో చర్చించాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియంను చుట్టుముడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతున్నారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నారు.
దీంట్లో భాగంగా ఈరోజు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసనకు పిలుపునివ్వడంతో టీడీపీ సభ్యులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.