అమరావతి : నంద్యాలలో దారుణం జరిగింది. నిషేధిత స్థలంలో మద్యం సేవించరాదని వారించిన హోంగార్డు శేఖర్ను గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. స్థానిక కేంద్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శేఖర్ విధుల్లో ఉండగా నలుగురు యువకులు కార్యాలయంలోకి వెళ్లారు. అనుమతి లేకుండా ఎందుకు వచ్చారని ఆ యువకులతో వారించడంతో అతడిపై ఎదురు దాడికి దిగారు.
వీరిమధ్య జరిగిన పెనుగులాటలో ఒక్కసారిగా దుండగులు హోంగార్డును బలంగా నెట్టివేయడంతో గేటుకు తల తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.