అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉండగా, నేటి నుంచి అదనంగా నలుగురిని నియమించారు. దీంతో మొత్తం 12 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు (NSG) పెంచారు. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
చంద్రబాబు ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది. గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పనిచేయనున్నారు. కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను వైసీపీ కార్యకర్తలు నిన్న ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండ ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోటీగా అధికార పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.