అమరావతి : ఏపీలో ఉపాధ్యాయ పోస్టులకు పరీక్షలు రాసే అభ్యర్థులకు హైకోర్టు తీపి కబురును అందించింది. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఏపీ టీచర్ నియామక పరీక్ష (ఏపీ టీఆర్టీ)ల మధ్య సముచిత సమయం ఉండేలా షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు (AP High Court) ప్రభుత్వానికి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. టెట్(TET), టీఆర్టీ(TRT) పరీక్ష షెడ్యూల్ను మార్చాలని స్పష్టం చేసింది.
పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని, రాత పరీక్ష తర్వాత ‘కీ’ పై అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వాలని ఆదేశించింది. టెట్, ఏపీ టీఆర్టీ ల మధ్య సముచిత సమయం ఉండేలా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై గత బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తీర్పును రిజర్వ్ చేశారు.
టెట్, టీఆర్టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం (Srikakulam) జిల్లాకు చెందిన ఎం. పెద్దిరాజు, మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దుచేసి ఈ పరీక్షల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టెట్ ముగిసిన తర్వాత టీఆర్టీ రాయడానికి సిద్ధమయ్యేందుకు తగిన సమయం లేదని, అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని విన్నవించారు. అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్లో మార్పులకు ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.