తిరుమల : ప్రతి శనివారం తిరుపతి (Tirupati) అర్బన్, తిరుమల(Tirumala) స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ(Angapradakshina Tokens) టికెట్లు, ఇకపై లక్కీడిప్( LuckyDip ) ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
అంగప్రదక్షిణ టికెట్లు కావలసిన భక్తులు గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తామని వెల్లడించారు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులకు వారి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తూ,ఆన్ లైన్ లో ఉంచుతామన్నారు.
లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు ఆన్లైన్లో రూ.500 డిపాజిట్ చేయాలని ససూచించారు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు మహతి కళాక్షేత్రంలో ఆధార్(Aadhar Card) కార్డు చూపి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చన్నారు. టికెట్లు పొందిన భక్తులకు శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తామన్నారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్ ను తిరిగి వారి ఖాతాల్లోకి టీటీడీ జమ చేస్తుందన్నారు.
తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కానీ భక్తులు లక్కీ డిప్ లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందిన వారికి, వారు చెల్లించిన రూ.500 డిపాజిట్ టీటీడీ తిరిగి చెల్లించదని, అంగప్రదక్షిణకు అనుమతించబోమని వివరించారు.