పోలవరం: గోదావరికి భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా గోదావరికి భారీ వరదలు వచ్చాయి. వరదలను సమర్థంగా తట్టుకునేందుకు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును 1.2 మీటర్ల మేర పెంచాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. 2.5 కిలోమీటర్ల పొడువున ఉన్న కాఫర్ డ్యాంను ఒక మీటరు ఎత్తు, రెండు మీటర్ల మేర వెడల్పు పెంచేందుకు కాంట్రాక్టర్ మెఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్ణయించింది.
కేవలం రెండు రోజుల్లోనే ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును మెఘా ఇంజినీరింగ్ సంస్థ పెంచింది. జులై 15 న పనులను ప్రారంభించి.. 17వ తేదీ కల్లా పనులు పూర్తి చేసింది. వరద నీరు ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి ప్రవహించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 12 వేల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ చేపట్టినట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 44 మీటర్ల ఎత్తుగా ఉన్నది. ప్రస్తుతం పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యాం సమీపంలో 37.8 మీటర్ల స్థాయిలో గోదావరి నీటిమట్టం ఉన్నది. ఎగువ కాఫర్ డ్యాం మరో ఆరు మీటర్ల ఎత్తు ఉంటుంది. అందులో పూర్తి కోర్తో నిర్మించిన ప్రాంతం 3 మీటర్లే ఉందని ఇంజినీర్లు చెప్తున్నారు. ప్రస్తుతం 19 లక్షల క్యూసెక్కుల నీటిని పోలవరం గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి మరింతగా వస్తున్న ప్రవాహాన్ని ఎలా ఎదుర్కొవాలనే దానిపై అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు.
ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం 28 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని తట్టుకునేలా నిర్మించారు. 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి దిగువకు ప్రవహించే ప్రమాదం ఉన్నది. దీన్ని దృష్టిలోపెట్టుకొని ఒక మీటరు మేర ఎగువ కాఫర్ డ్యాం పొడవునా 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచారు. ఎగువ కాఫర్ డ్యాం ఎగువ భాగం మొత్తం 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ మొత్తం కాకుండా 2 మీటర్ల వెడల్పుతోనే ఎత్తు పెంచారు. నీరు ఎగువ కాఫర్ డ్యాం దాటి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పనులు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.