అమరావతి : వారం రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలోని ప్రజలు తేరుకోకముందే మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అల్పపీడనం కారణంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలో శనివారం నుంచి వర్షాలు పడవచ్చని , సుమారు 13 సెం.మీ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ హెచ్చరికలతో చిత్తూరు జిల్లా అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. విద్యాసంస్థలకుసెలవు ప్రకటించారు.
తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. ప్రజలు కాజ్వేలు దాటవద్దని తెలిపారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శనివారం నుంచి 30వ తేదీ వరకు దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షం, రాయలసీమకు కూడా వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.