అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడడంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. అనుబంధంగా దక్షిణ కోస్తా నుంచి ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు. ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు . ఇది ఇలా ఉండగా కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.
గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 19.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు లో 19 సెంటిమీటర్లు, తడలో 18.9 సెంటిమీటర్లు, వాకాడులో 18.2, నాయుడు పేటలో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్రవిపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. అత్యవసర సహాయ చర్యల కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్టు స్పష్టం చేశారు. కడప జిల్లా రాయచోటిలో బుగ్గవంక నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన కారు నుంచి ఓ యువకుడిని తాడు సాయంతో పోలీసులు రక్షించారు.