Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం మధ్యాహ్నం నుండి ఎడ తెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షం కారణంగా సాయంత్రం జరగవలసిన కార్తీకమాస లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి ప్రత్యేక పూజా కార్యక్రమాలు రద్దయినట్లు పీఆర్వో శ్రీనివాస్రావు తెలిపారు.
కార్తీకమాసం మూడవ సోమవారం నాడు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చి యాత్రికులతో శ్రీశైలం పుర వీధులు సందడిగా మారాయి. వర్షంతో కొద్దిగా ఇబ్బందులకు గురైన భక్తులకు దర్శనాలు కల్పించేందుకు ఆలయ అధికారులు పలు ఏర్పాట్లు చేసి టైం స్లాట్ ప్రకారం ఆలయ ప్రవేశం కల్పించారు. రాబోయే రెండు, మూడు రోజులు తుఫాను ప్రభావం ఉంటున్నందున భక్తులు తగు జాగ్రత్తలతో క్షేత్రానికి చేరుకోవాలని ఈవో పెద్దిరాజు కోరారు.