అమరావతి : కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి హరి రామజోగయ్య (Hari Ramajogaiah) జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు మరోసారి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ను ఢీ కొని అధికారంలోకి రావాలంటే అనుసరించాల్సిన వ్యూహాలను, ప్రవేశపెట్టాల్సిన పథకాలను సూచిస్తూ లేఖ రాశారు. జగన్ మరోసారి అధికారం చేపట్టడమే ధ్యేయంగా నవరత్నాలు పేర కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలపైనే ఆధారపడిన మాట వాస్తవమేనని అన్నారు. సంక్షేమాన్ని సంక్షేమంతోనే కొట్టాలని సూచించారు.
వైఎస్సార్ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పేర్కొన్నారు. జనసేన, తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతిని కోరే హామీలు ఇస్తే విజయానికి దగ్గరవటం ఎంత అవసరమో తెలుసుకోవాలని సూచించారు. ఎక్కువ జనాభాకు ఉపయోగపడే విధంగా, వారికి మేలు చేకూరే పథకాలను విధంగా మేనిఫెస్టోలో చేర్చాలని అన్నారు.
వైఎస్ జగన్ పాలనలో ధరలు విఫరీతంగా పెరిగాయని, దీనికి తోడు పన్నుల రూపేణా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వర్గాలకు చేదోడుగా తెల్లకార్డులు ఉన్న వారందరికి నెలకు రూ.2వేలు ఇవ్వాలని కోరారు. దాదాపు 9 ప్రతిపాదనలను సూచిస్తూ లేఖలో రాశారు. హామీలు అమలు చేయడానికి మనస్సు ఉండాలే కాని నిధులు సమకూర్చుకోవటం పెద్ద కష్టమేమి కాదని సూచించారు.