Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా జరిపించినట్లు ఈవో పెద్దిరాజుతెలిపారు. ఆలయ ధర్మకర్తలమండలి ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. సాయంకాలార్చనలు హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు.
మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో ఆలయోత్సవంతోపాటు క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు.ఉత్సవమూర్తులు గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలువీరభధ్ర స్వామి వరకు జరిగిన ఊరేగింపు ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది.
అఖండమైన ఙ్ఞానానికి ప్రతీక అయిన హంసను వాహనంగా చేసుకుని సకల కళలకు అధిపతి అయిన పరమేశ్వరుడు ఙ్ఞాన శక్తి అయిన అమ్మవారితో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవం అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామిఅమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది. గ్రామోత్సవంలో చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులతోపాటు, ఈఈలు రామకృష్ణ, మురళీదర్ రెడ్డి, పౌరసంభందాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, ఫణీందర్ ప్రసాద్,మల్లికార్జున రెడ్డి,మోహన్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అయ్యన్న, సూపరింటెండెంట్ మధుసూదన్రెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మయూర వాహనంపై శ్రీశైల ఆది దంపతులు..
శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు సోమవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్ర్తోక్త పూజలు నిర్వహించి సాయంత్రం మయూర వాహనంపై భక్తులకు గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారని ఈవో పెద్దిరాజు తెలిపారు.