అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి అనంతరం ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తెలుగుదేశం పార్టీని వీడి రెండురోజులు గడవక ముందే మరో మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడటంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. టీడీపీ సీనియర్ నేత, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్ఎం జియావుద్దీన్ ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శృంగవరపు కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి సైతం త్వరలో వైసీపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది.