Kodali Nani | ఉగాది పర్వదినాన వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని.. వాళ్ల వేతనాలను డబుల్ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన వాగ్దానంపై కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చేవాన్ని దొంగ వాగ్దానాలే అని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదని స్పష్టం చేశారు.
గుడివాడలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ.. వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయని అన్నారు. అందులో టీడీపీ కార్యకర్తలనే నియమిస్తారని చెప్పారు. వాలంటీర్లను తొలగించం.. వాళ్ల జీతాలు పెంచుతామని చంద్రబాబు చెప్పే పిట్టకథలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని విమర్శించారు. వాలంటీర్లపై గతంలో చంద్రబాబు విషం కక్కారని ఆరోపించారు. గతంలో వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టే వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే.. ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకుని మరి పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధే అని వ్యాఖ్యానించారు.