తిరుపతి : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టీటీడీ(TTD) స్థానికాలయాలతో పాటు ఉప ఆలయాల్లోనూ యూపీఐ(UPI) చెల్లింపులకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. సేవ టిక్కెట్లు(Seva Tickets), ప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే(Phone Pay), క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా యూపీఐ, డెబిట్ కార్డు (ఆన్ లైన్) ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆయా ఆలయాల అధికారులతో శనివారం ఈ మేరకు వర్చువల్(Virtual) సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధిపనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. టీటీడీ వెబ్సైట్, ఎస్వీబీసీ, యాత్రికులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, బస్టాండు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల గురించి తెలిసేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
స్థానికాలయాల్లో కల్యాణోత్సవంతోపాటు ఇతర ఆర్జితసేవలు ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఆలయాల్లో పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు పెంచాలని డీఎఫ్వోను ఆదేశించారు. అన్ని ఆలయాల్లో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు.