అమరావతి : సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న తెనాలి మహిళ గీతాంజలి (Gitanjali) కుటుంబానికి ఏపీ సీఎ వైఎస్ జగన్ (CM Jagan) రూ. 20 లక్షల పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని అన్నారు.
గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమని హోంమంత్రి తానేటి వనిత(Home Minister Vanitha) ఆరోపించారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించామని, కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అక్కౌంట్స్ పై నిఘా పెట్టామని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం వల్ల తన కుటుంబానికి జరిగినే మేలు గురించే మాట్లాడిందని, అలాంటి సాధారణ గృహిణి మీద ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని పేర్కొన్నారు.
ఆత్మహత్య ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దోషుల సంగతి తేల్చుతామని , మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.