Maha Shivaratri | మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వేల మంది భక్తులు ఒక్కసారిగా తరలి వచ్చారు. దీంతో శ్రీశైలం జనసంద్రంగా మారింది. మల్లన్న దంపతులను దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా శివ భక్తులు తరలి వచ్చారు. కాలి నడకన వచ్చే వారితోపాటు సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో తరలి వచ్చిన వారి సంఖ్య లక్ష మందికి పైగా ఉంటుందని చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మెక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు దీరుతున్నారు.
అయితే వీఐపీ దర్శనాల కోసం క్యూ లైన్లు నిలిపివేయడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలంకార దర్శనాల కోసం తాము గంటల తరబడి కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి వస్తుందని సామాన్య భక్తులు తెలిపారు. అంతేగాక కాలినడకతో వచ్చిన యాత్రికులకు మౌలిక వసతులు అరకొరగానే ఉన్నాయి. ఫలితంగా భక్తులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యామని పాదచారులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాలినడకన వచ్చిన భక్తులు రాత్రివేళ ఫుట్పాత్లు, రోడ్లు, డివైడర్లపైనే నిద్రలు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు సరిపడా సిబ్బంది లేరు. ఫలితంగా వసతుల కల్పనకు కొంత ఇబ్బందులు పడవలసి వస్తుందని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు తెలిపారు. మరోవైపు సెల్టవర్లు పూర్తిగా పని చేయడం లేదు. ఫలితంగా సకాలంలో సమాచారం లభించక భక్తులతోపాటు శ్రీశైలం దేవస్థానం అధికారులు కూడా అవస్థలు పడుతున్నారు.
ఇక వాహన పార్కింగ్లు ఒకవైపు.. దర్శన అనంతరం బయటికెళ్లే దారి లేక భక్తుల్లో దారి తప్పుతున్న వారి సంఖ్య బాగానే ఉంది. ముఖ్యంగా ఐదేండ్లలోపు చిన్నారులను వారి సొంత వారి దరి చేర్చడంలో మైక్ రూమ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని చెబుతున్నారు. ప్రతియేటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముందస్తు ప్రణాళికల్లేకపోవడం అధికార యంత్రాంగం వైఫల్యమేనని శివస్వాములు, భక్తులు మండి పడుతున్నారు.
శ్రీశైలం శైవక్షేత్రానికి వచ్చే యాత్రికుల సమస్యల పరిష్కారానికి తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పని చేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మంచినీరు, పారిశుద్ధ్యం, భోజన వసతులు, ఉచిత దర్శనాలు, వైద్యశిబిరాలు, కళ్యాణకట్ట ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించారు. భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు శ్రీశైలంలోనే ఉండి భక్తులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.