Road Accident | ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై తణుకు నుంచి విశాఖ పట్నానికి హైడ్రో క్లోరిక్ యాసిడ్తో వెళుతున్న ట్యాంకర్ను వెనుక నుంచి గ్యాస్ సిలిండర్లతో వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో యాసిడ్ ట్యాంకర్కు ఉన్న పైప్ ఒక్కసారిగా తెగిపోవడంతో యాసిడ్ లీకై పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.
ఆ పొగను పీల్చిన ట్యాంకర్ డ్రైవర్ అస్వస్థతకు గురయ్యాడు. డ్రైవర్ తోపాటు మరో ఇద్దరు స్వల్పంగా అస్వస్థతకు గురి కావడంతో వారిని చికిత్స కోసం తుని ఏరియా దవాఖానకు తరలించారు. దీంతో రహదారిపై గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులతో తీవ్ర అవస్థల పాలయ్యారు. యాసిడ్ వాసన భరించలేక నరక యాతన అనుభవించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక దళ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ నిలిపేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.