విజయవాడ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టనున్న 31 జాతీయ రహదారుల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఏపీ సీఎం జగన్తో కలిసి ఆయన ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్ర రవాణాశాఖ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లోని హైవేలకు మహర్దశ పట్టింది. ఇతర రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తున్న కేంద్రం.. ఏపీలో మాత్రం జాతీయ రహదారుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వం రూ.10,401 కోట్ల వ్యయంతో ఏపీలో 741 కిలోమీటర్ల హైవేలను నిర్మించనున్నారు. ఇందులో రూ.5,740 కోట్ల వ్యవయంతో 571 కిమీ మేర 24 ప్రాజెక్టులను కేంద్ర రవాణా శాఖ చేపడుతుండగా, మిగతా 7 ప్రాజెక్టులు 170 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తున్నది. ఇందుకోసం రూ.4660 కోట్లను ఖర్చు చేయనున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 51 రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గుర్తించిన కేంద్ర రవాణా శాఖ.. ఆ మేరకు నిధులు కేటాయించి పనులు పూర్తిచేయడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇప్పటికే రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రోడ్లను ప్రారంభించాల్సి ఉన్నది. కాగా, నితిన్ గడ్కరీ పర్యటన సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.