అమరావతి : నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కటకటాల పాలయ్యారు. విజయవాడలోని కృష్ణలంక పీఎస్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు సురేశ్, సుబ్బారెడ్డి హోంగార్డు ఉద్యోగాల పేరుతో ఇద్దరు నిరుద్యోగుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశారు. సుమారు రూ. 18 లక్షలను బాధితుల నుంచి తీసుకున్న కానిస్టేబుళ్లు చివరకు మొండిచేయి చూపారు.
దీంతో బాధితులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించగా ఇద్దరు కానిస్టేబుళ్ల విచారణ జరిపి నిరుద్యోగులను మోసం చేసినందుకు గాను వారిని అరెస్టు చేశారు. కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.