అమరావతి : నెల్లూరు జిల్లాలో ఘోర దుర్ఘటన ప్రమాదం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద కూలీలతో వెళ్తున్న మినీ ట్రక్కును పాలవ్యాను ఢీకొంది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలు కాగా.. వారిని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మృతులు చేపల వేట కోసం విడవలూరు వెళ్లేందుకు మినీ ట్రక్కు ఎక్కుతుండగా.. పాల వ్యాన్ దూసుకువచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబు, మాలకొండయ్య, శీనయ్య, రమణయ్య నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వేగంగా మినీ ట్రక్కును ఢీకొట్టడంతో పాల వ్యాన్ డ్రైవర్ సైతం క్యాబిన్లోనే ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాగా.. బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.