అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య (Annamayya) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మదనపల్లె గ్రామీణం పుంగనూరు రోడ్డులో 150వ మైలు వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారును చెరువులోనుంచి వెలికితీశారు.
మృతులు ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన దంపతులు గంగిరెడ్డి, మధులత, వారి కుమార్తె కుషితారెడ్డి, కుమారుడు దేవాన్ష్రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.