అమరావతి : ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి మించి వాడకం ఎక్కువకావడంతో విశాఖలోని సింహాద్రి, హిందూజా ఎన్టీపీసీ ప్లాంట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలిచిపోవడం ఇదే తొలిసారి. సంబంధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూనే అవసరమైన ఏర్పాట్లకు అధికారులను అప్రమత్తం చేశారు. సెలవుల్లో ఉన్న ఇంజినీర్లు హుటాహుటిన కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించడం తీవ్రతను తెలియజేస్తుంది.
విశాఖపట్నం ఎన్టీపీసీ సింహాద్రిలో 4 యూనిట్లలోని విద్యుదుత్పత్తి నిలిచి పోయింది. 2 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం అత్యవసర మరమ్మతు పనుల్లో నిమగ్నమైంది. ఒకేసారి 4 యూనిట్లలోనూ విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడూ నిలిచిపోలేదు. గ్రిడ్ నుంచి కూడా ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్ సరఫరా కావడంలేదు. మరోవైపు అర్ధరాత్రి నుంచి పరవాడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హిందూజా రెండు యూనిట్లు ఉత్పత్తి నిలిచిపోవడం 1040 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది .
ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆధారమైన కలపాల 400 కేవీ విద్యుత్ స్టేషన్కు గ్రిడ్ నుంచి సరఫరా నిలిచి పోయింది. దాదాపు రెండున్నర గంటల తర్వాత విజయనగరం జిల్లా మరడం 400 కేవీ విద్యుత్ స్టేషన్ నుంచి పాక్షికంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.