అమరావతి : ఏపీలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహిత ఆర్థిక కష్టాలతో ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య ( Suicide ) చేసుకుంది. తిరుపతి ( Tirupati ) జిల్లా పుత్తూరులో పుత్తూరు మండలం నేషనూరుకు చెందిన పద్మ (28), తొరూరు పంచాయతీకి చెందిన శివశంకర్ పుత్తూరులో డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ పెళ్లికి కులాలు వేరు కావడంతో పాటు , శివశంకర్ జులాయిగా తిరుగుతున్నాడని పద్మ తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించారు.
దీంతో ఇద్దరు 2019లో వివాహం చేసుకోగా వీరికి తేజ(6), లాస్య(5) కుమార్తెలు పుట్టారు. పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు ప్రతినెలా ఇబ్బంది పడుతుండడంతో, భర్త ఇంటి విషయాలు పట్టించుకోవడం లేదని ఇద్దరి మద్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. చివరకు శనివారం రాత్రి ‘తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠమంటూ’ సూసైట్ నోట్ రాసి ఇద్దరి పిల్లలకు ఉరివేసి ఆత్మహత్య చేసుకుంది.
ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదని అనుకుంటుందో, అవన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇది నేను కలలోనూ అనుకోలేదు. శివశంకర్, నిన్ను ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా కడుపున పుట్టిన పిల్లలు కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే.. నేనేం చేయాలి. ఇక ఉంటా ! నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు. ఈ సారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో అని లేఖ రాసి ఈ అఘాత్యానికి పాల్పడింది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భర్త శివశంకర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.