తిరుపతి : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో టీటీడీ భక్తులకు అన్నప్రసాదాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శుక్రవారం ఏపీలోని వివి ధ జిల్లాల నుంచి వచ్చిన ప్రకృతి వ్యవసాయ రైతులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించేందుకు రైతు సాధికార సంస్థ గుర్తించిన రైతుల నుంచి మార్క్ఫెడ్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి టీటీడీకి అందించాలని సూచించారు.
గతేడాది మొదటి విడతగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 2500 టన్నుల శనగలను కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది మరో 12 రకాల ఉత్పత్తులు కలిపి దాదాపు 16 వేల టన్నులు సేకరించాలని బోర్డు నిర్ణయించిందన్నారు. రానున్న కాలంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీకి అవసరమైన అన్ని వంట సరుకులను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినవే కొనుగోలు చేస్తామన్నారు.
ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు రెండు వేలకు పైగా గోవులు, ఎద్దులను ఉచితంగా అందించామని ఈవో వెల్లడించారు. మార్క్ఫెడ్ ఎండీ పీఎస్. ప్రద్యుమ్నా, టీటీడీ జేఈవో సదా భార్గవి, రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు, టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.