తాడేపల్లి: ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు ఏపీ సర్కార్ మొగ్గు చూపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారానికి ఐదు రోజుల పని పాలసీ గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రభుత్వ ఉత్తర్వు విడుదల చేశారు.
ఐదు రోజుల వారం పని విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పనివేళలు గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. ఐదు రోజుల పని పాలసీని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.