అమరావతి : రాజమండ్రిలోని కుమారి టాకీస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సన్ ఎలక్ట్రానిక్స్ టీవీ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దుకాణంలో అన్ని ఎలక్ట్రికల్ వస్తువులే ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి.. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. షోరూంలో ఉన్న టీవీలు, సౌండ్ సిస్టమ్స్ సైతం మంటల్లో కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. టీవీ షోరూం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండగా.. పైకి మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో పై అంతస్తుల్లో ఉన్న వారందరినీ అగ్నిమాపక సిబ్బంది కిందకు దింపారు. ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.