తిరుమల: తిరుమలలో (Tirumala) మరో చిరుత (Leopard) చిక్కింది. గురువారం తెల్లవారుజామున అలిపిరి మెట్లమార్గంలోని (Step Way) లక్ష్మీనరసింహస్వామి ఆలయం-7వ మైలు మధ్య ప్రాంతంలో బోనులో చిక్కింది. దీంతో రెండు నెలల వ్యవధిలో ఐదు చిరుతలను అధికారులు పట్టుకున్నట్లయింది. నాలుగు రోజుల క్రితంమే ట్రాప్ కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. నెల్లూరు చిన్నారి లక్షిత మృతదేహం లభించిన చోట ఏర్పాటు చేసిన బోను వద్ద సంచరించిన చిరుతపులి మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో దానిని బంధించడానికి చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నేడు అది బోనుకు చిక్కడంతో అధికారులు, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
గత నెలలో తిరుమల కొండపైకి నడకమార్గంలో వెళ్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలికను అలిపిరి వద్ద చిరుత పులి దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమయిన అధికారులు తిరుమల గిరుల్లో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. దీనికితోడు నడక మార్గంలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. గత నెలలోనే అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుల్లో మూడు చిరుతలు చిక్కాయి. అంతకుముందు చిరుత కూనను పట్టుకున్నారు. తాజాగా మరో చిరుత చిక్కడంతో ఇప్పటివరకు ఐదు చిరుతపులులను పట్టుకున్నట్లయింది.