అమరావతి : కరోనా బారినపడి చికిత్స కోసం దవాఖానకు వెళ్లిన వృద్ధురాలు కనిపించకపోవడంతో అంతా చనిపోయిందని భావించారు. మృతదేహం కోసం వెళ్లి దవాఖానలో మరొకరి మృతదేహాన్ని ఆమెదిగా భావించి తీసుకొచ్చి కర్మకాండ చేశారు. 10 రోజుల తరువాత ఆ వృద్ధురాలు ఆటోలో నుంచి ఇంటి ముందు దిగడంతో కుటుంబీకులు, గ్రామస్తులు అవాక్కయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం క్రిస్టియన్ పేటలో ఈ అరుదైన ఘటన జరిగింది. క్రిస్టియన్ కాలనీకి చెందిన గిరిజమ్మ(75) కరోనా బారినపడటంతో గత నెల 12న చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ దవాఖానలో చేరింది.
15వ తేదీ నుంచి ఆమె కనిపించకపోవడంతో చనిపోయిందని భావించిన కుటుంబీకులు శవాగారంలో మృతదేహం కోసం వెతికారు. మరో వృద్ధురాలి మృతదేహాన్ని గిరిజమ్మదిగా భావించి స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 10 రోజుల క్రితం గిరిజమ్మ కుమారుడూ కరోనాతో మృతి చెందడంతో ఇద్దరికి కలిపి నిన్న పెద్దకర్మ నిర్వహించారు. ఇంతలో ఇవాళ ఉదయం ఆటోలో వచ్చిన గిరిజమ్మ ఇంటి ముందు దిగింది. దీంతో ఆమెను చూసిన కుటుంబీకులు, స్థానికులు ఆశ్చరయ్యానికి గురయ్యారు. తాను విజయవాడ దవాఖాన నుంచే వచ్చినట్లు చెప్పడంతో తలలు పట్టుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.