YS Sharmila | ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ హత్యారాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత బాబాయిని హత్య చేసిన వారిని తన పక్కన బెట్టుకుని, పిలిచి మరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇస్తున్నారని ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియామయమే అయ్యిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయని వైఎస్ షర్మిల ఆరోపించారు. చక్కెర మొదలు పెట్రోల్ వరకూ సామాన్యులపై మోయలేని భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కితే ఇచ్చేది రూ.10 అని, తిరిగి రూ.100 వసూలు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుకు రూ.2 లక్షల వరకూ రుణ మాఫీ చేయడంతోపాటు ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామన్నారు. రూ.5 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు. వృద్ధుల పెన్షన్ రూ.4000, వికలాంగుల పెన్షన్ రూ.6,000లకు పెంచుతామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా, రాష్ట్రానికి రాజధాని నిర్మించాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ బాగు పడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు.