అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విజయవంతంగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందజేసే చికిత్సల జాబితాను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చూడాలన్నారు. గ్రామ వైద్యశాల, పీహెచ్సీలకు డిజిటల్ వీడియో కనెక్టివిటీ ఉండాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ ద్వారా 2,446 చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అక్కడి నుంచి దవాఖానాకు చెల్లిస్తారు. దవాఖానాలో రోగి చేరిన తర్వాత మొదట సమ్మతి పత్రం జారీ చేస్తారు. చికిత్స పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఇదే సందర్భంగా దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కూడా సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నదని అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా కొవిడ్ కేసులు నమోదవుతున్నా, దవాఖానాలో చేరిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, ప్రస్తుతం 69 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే 87.15 శాతం మందికి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. నూతన వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మెడికల్ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పారు. ముందు జాగ్రత్త డోస్ వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ముఖ్యంగా 60 ఏండ్ల వయసు పైబడిన వారికి ముందస్తు జాగ్రత్తలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 15 నుంచి 17 ఏండ్లలోపు వారిలో 99.69 శాతం, 12-14 ఏండ్లలోపు వారిలో 98.93 శాతం మందికి రెండో డోస్ అందజేసినట్లు అధికారులు తెలిపారు.