తిరుమల : బ్రహ్మోత్సవాలకు ( Brahmotsavams ) వచ్చే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని( Tirumala ) అన్ని గదులలో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ( EO Shyamala Rao ) అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో అధికారులతో బ్రహ్మోత్సవాల్లో భక్తుల వసతి, ఇతర సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని పలు విశ్రాంతి గృహాలు, కాటేజీల మరమ్మతు పనులను రిసెప్షన్ విభాగంతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. యాత్రికుల వసతి సముదాయాల్లో కూడా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉండడంతో మరొక ప్రాంతంలో కూడా అన్న ప్రసాద భవనం ఏర్పాటును పరిశీలించాలని ఆదేశించారు.
తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించాలన్నారు. పంచాయతీ, రెవెన్యూ విభాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించాలన్నారు. తిరుమలలోని హోటళ్లలో భక్తులకు సాంప్రదాయ భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని అన్ని కౌంటర్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీఈ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.