YS Jagan | వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, ఆరుగురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని విమర్శించారు.
చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మొదలు, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా, స్థానిక కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిందని అన్నారు. అయినప్పటికీ విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటని ప్రశ్నించారు. జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్గా తీసుకోలేదనేకదా అర్థం అని నిలదీశారు. తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్ను డిస్మిస్ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా? అని వైఎస్ జగన్ నిలదీశారు.
ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబు దాన్నికూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోందని వైఎస్ జగన్ విమర్శించారు. మరోవైపు డిప్యూటీ సీఎం క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం ఏమో, లేదు.. క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారని అన్నారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట జరిగి, ఆరుగురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెబితే సరిపోతుందంటారా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? అని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలని హితవుపలికారు. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదని స్పష్టం చేశారు. చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీళ్లందరినీ వెంటనే డిస్మిస్ చేసి, వీరిపై కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలన్నారు. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.