తిరుపతి : టీటీడీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరింత మెరుగైన ఉద్యోగ భద్రత కోసం శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ను అధికారులు ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో వెయ్యి మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అదనపుఈవో మాట్లాడుతూ ఇప్పటి వరకు సొసైటీలు, ఏజెన్సీల ద్వారా పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ భద్రత ఏర్పడుతుందన్నారు. వీరికి గుర్తింపు కార్డు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
టీటీడీలోని అన్ని విభాగాల్లో వివిధ కేటగిరీల్లో 75 సొసైటీలు, ఏజెన్సీల ద్వారా 7,252 మంది ఉద్యోగుల సేవలను ఉపయోగించుకుంటుందని వివరించారు. కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు జీతాలు, గ్రాట్యుటీ ఇతర ప్రయోజనాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జీతాలు చెల్లించడంతోపాటు వారికి సామాజిక భద్రత కూడా కార్పొరేషన్ కల్పిస్తొందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎస్ఎల్ఎస్ఎమ్పీ కార్పొరేషన్ సీఈవో శేష శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.