శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, ప్రధానార్చకులు, వేదపండితులతో ఈవో లవన్న సమావేశం నిర్వహించారు. జిల్లాయంత్రాంగం సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అంతా కృషి చేయాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా కైంకర్యాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏఈవో హరిదాసును ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు. ఏర్పాట్లలన్నీ ముందస్తుగానే పూర్తి చేయాలని, ఈ మేరకు యాక్షన్ ప్లాన్ను కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఉత్సవాల్లో నిర్వహించాల్సిన వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు, స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఉత్సవాల సమయంలో ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లపై చర్చించారు. పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీముని కొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి ఆలయం వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో నడకదారిలో వచ్చే భక్తులకు, శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు ఏర్పాట్లు, అలాగే ఆలయ పరిసరాల్లో తాత్కాలిక వసతి ప్రదేశాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలిచ్చారు.
క్షేత్రంలో పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలని, పార్కింగ్, సామాన్లు భద్రపరిచే గదులు, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టిపెట్టాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సర్కిల్ ఇన్స్పెక్టర్కు సూచించారు. పాతాళగంగలో కంచెలు ఏర్పాటు చేయాలని, దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా పండుగ వాతావరణం ఉండేలా విద్యుద్దీపాలంకరణ ఉండాలని, ఎలక్ట్రిక్ విభాగం ఇంజినీర్ను ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ రాజేంద్రసింగ్, సీఐ దివాకర్రెడ్డి, వైద్యాధికారి సోమశేఖరయ్య, ఆలయ అధికారులు పాల్గొన్నారు.