ప్రకాశం : (Maha padayatra) అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఇవాళ 9 వ రోజు పాదయాత్ర ఇంకొల్లు నుంచి మొదలైంది. ఇవాల్టి పాదయాత్ర దుద్దుకూరు వరకు 10.5 కిలోమీటర్ల మేర కొనసాగనున్నది. ఇంకొల్లు వద్ద పాదయాత్ర మొదలవగానే పరిసర గ్రామాల ప్రజలు హాజరై రైతులు, మహిళలపై పూలవర్షం కురిపించారు. రైతులతో గొంతు కలుపుతూ అమరావతి రాజధానిగా ఉంచాలంటూ నినదించారు. రాజధాని కోసం భూములను ఇచ్చిన అన్నదాతలను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాఉండగా, అమరావతి రాజధాని కోసం పాదయాత్ర చేపట్టిన రైతులు, మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6 న విధి నిర్వహణలో ఉన్న తనపై రైతులు దాడి చేశారంటూ కానిస్టేబుల్ చంద్రానాయక్ ఫిర్యాదు చేయడంతో పర్చూరు పోలీసులు కేసు పెట్టారు. అలాగే, చిననందిపాడులో అనుమతి లేకుండా సభ నిర్వహించారని మరో కేసు కూడా నమోదు చేశారు. పాదయాత్రలో రైతులు నిబంధనలు పాటించాలని, అప్పటివరకు సహకరిస్తామని ప్రకాశం జిల్లా ఏఎస్పీ రవిచంద్ర స్పష్టం చేశారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ట్రాఫిక్ ఆటంకాలు కలిగించవద్దనే విషయాన్ని రైతులతో చర్చించినట్లు చెప్పారు.
రైతుల మహా పాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగనున్నది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న తిరుపతిలో ముగుస్తుంది. డిసెంబర్17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..